17, అక్టోబర్ 2020, శనివారం

శ్రీ గోవిందరాజుల సుబ్బారావు

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
నేటి మన చిరస్మరణీయులు...
శ్రీ గోవిందరాజు సుబ్బారావుగారు..  
తెలుగు నాటకాలలో సినిమాలలో,  తొలితరం నటులు. నాటక రంగంపై కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లుగా, సినిమా రంగంలో మాలపిల్లలో సుందర రామశాస్త్రి పాత్రలోనూ, బాలనాగమ్మలో మాయల మరాఠీగానూ ప్రఖ్యాతుడయ్యాడు.
వీరు 1895 సంవత్సరంలో జన్మించారు. వీరు మొదట్లో చరిత్ర విద్యార్థిగా తన చదువు ప్రారంభించారు. తర్వాత వైద్యవిద్యను అభ్యసించి ఎల్.ఎం.పి. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు.డాక్టరుగా తెనాలిలో స్థిరపడి పేరుప్రతిష్ఠలు సంపాదించారు. తరువాతి కాలంలో హోమియోపతి వైద్యంపై తన దృష్టి మరల్చి, దానిని అభ్యసించి, కొన్ని పరిశోధనలు నిర్వహించారు. అణు విజ్ఞానాన్ని చదివి ఐన్‌స్టీన్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపారు. ఇతను విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల, సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి కలవారు. ఆంగ్లంలో ఇనార్గానిక్ ఎవల్యూషన్ అనే ఒక వైజ్ఞానిక గ్రంథాన్ని రచించారు. అయితే గోవిందరాజు సుబ్బారావుగారు నటునిగానే సుప్రసిద్ధుడయ్యారు.

పాఠశాలలో చదివేటప్పుడు వార్షికోత్సవ సందర్భంలో మర్చంట్ ఆఫ్ వెనిస్ అనే ఆంగ్ల నాటకంలో ఒక పాత్రను నిర్వహించటంలో సుబ్బారావు నట జీవితం ప్రారంభమైంది. సంగీతాన్ని నేర్చుకున్న సుబ్బారావు 20 రాగాలను క్షుణ్ణంగా అభ్యసించారు. పూర్వ విద్యార్థి సంఘ వార్షికోత్సవంలో గయోపాఖ్యానం నాటకంలో సాత్యకిగా, భీముడుగా రెండు భిన్నమైన పాత్రల్ను పోషించి తెలుగు నాటక రంగంలో అడుగుపెట్టారు. తెనాలిలో రామవిలాస సభవారి నాటకాలలో పాల్గొని బొబ్బిలి యుద్ధంలో హైదర్ జంగ్, బుస్సీ పాత్రలను నిర్వహించారు. కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లు, ప్రతాపరుద్రీయంలో పిచ్చివాడి పాత్రల్లో వీరి నటన తెలుగు నాట పేరు ప్రఖ్యాతులు తెచ్చింది.

అప్పుడప్పుడే ప్రారంభమవుతున్న తెలుగు సినిమా రంగంలోనూ క్యారెక్టర్ నటునిగా, ప్రతినాయకుడిగా పలు పాత్రలు పోషించి మెప్పించారు. మాలపిల్లలో సుందర రామశాస్త్రిగా, షావుకారులో చెంగయ్య, బాలనాగమ్మలో మాయల మరాఠీగా ప్రేక్షకుల విశేష ప్రశంసలను పొందారు.
ఈయన చెన్నైలోని స్వగృహంలో అక్టోబరు 28, 1959 సంవత్సరంలో మరణించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి